కలం, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికల (Kerala Assembly elections) ప్రచారంలో రెండు రోజుల పాటు పాల్గొననున్నారు. రాష్ట్రం నుంచి సీఎం వెంట వెళ్లిన మరికొంత కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. అంతకు ముందు చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ఇటీవల రంజిత్ రెడ్డి తల్లి మరణించినందున ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 9న 140 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అక్కడి రాజకీయ పార్టీలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. అటు కేరళలో మొత్తం ఓటింగ్ శాతాన్ని 85% కంటే ఎక్కువగా లక్ష్యంగా పెట్టుకోవాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న 2.71 కోట్ల ఓటర్లలో 18-19 ఏళ్ల వయసు వారు 4,66,408 మంది ఉన్నారు. వీరిలో 2,34,707 మంది పురుష ఓటర్లు కాగా, 2,31,701 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

