కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ తిరిగివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి వచ్చే క్రమంలో సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా.. సింగిల్ లైన్లో మాత్రమే ముఖ్యమంత్రి కాన్వాయ్ రావడం గమనార్హం. ఎక్కడా ట్రాఫిక్ ఆపకుండా, పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిన్న ఉదయం దిల్లీకి వెళ్లే క్రమంలో తన కోసం ట్రాఫిక్ ఆపివేయడాన్ని గమనించిన వెంటనే డీజీపీకి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి తన కాన్వాయ్ వెళ్లే క్రమంలో.. ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆపేయొద్దని.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అలా ఆపినా వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతుండటం, సీఎం సహా ఇతర ప్రముఖులు రాకపోకలు సాగించేటప్పుడు వాహనాలు నిలిపేస్తుండటంతో.. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక నుంచి ట్రాఫిక్ వ్యవహారాలు పరిశీలించేందుకు ప్రత్యేకంగా అదనపు డీజీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ.ఆనంద్ నిర్ణయించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

