కలం, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై టీడీపీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ (Pithapuram Varma) ను పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంలో వర్మ వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్ఠానం తాజా నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని టీడీపీ హైకమండ్ స్పష్ఠం చేసింది.
అధిష్ఠానం నిర్ణయంపై వర్మ భావోద్వేగం
టీడీపీ అధిష్ఠానం నిర్ణయంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. పలు రకాల సమీకరణాలతో టీడీపీలో మార్పులు జరుగుతాయని వెల్లడించారు. అయితే మంత్రి నారా లోకేశ్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటును నిర్ణయించారని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే పార్టీ నిర్ణయంపై మాట్లాడే సందర్భంలో కన్నీళ్లు అపుకుంటూ మీడియా సమావేశం నుంచి వర్మ వెళ్లిపోయారు.

