కలం, వెబ్ డెస్క్: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వరంగల్ ఎయిర్పోర్ట్ (Warangal Airport) నిర్మాణం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడ విమానాలు ఎగరడమనేది కల లాంటిదన్నారు. డిసెంబర్ నెలలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్న నేపథ్యంలో ఈ మేరకు ముఖ్యమంత్రి స్పందించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. వాళ్లు ఎంతసేపు కుటుంబ అవసరాలు, ఫాంహౌస్ల్లో సేద తీరేవారన్నారు.
మీరే పేరు సూచించండి..
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల కలను నెరవేర్చబోతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మామునూరులో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 295 ఎకరాలను కేటాయించిందన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే భూమిని కూడా అప్పగించినట్లు వివరించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడంతో తెలంగాణలో ఎయిర్ కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు. దీనికి ఏం పేరు పెడుదామో.. మీరే సూచనలు చేయండి.. అంటూ ప్రజలను కోరారు.

