కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. దీంతో ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విమానాన్ని దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న వేళ వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి విమానం ల్యాండింగ్ కు ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో శంషాబాద్ వస్తున్న విమానాన్ని పైలట్ బెంగళూరుకు డైవర్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో దిగి ఈ రాత్రి అక్కడే బస చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రిలో భారీ వర్షం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

