కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (CM Mohan Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కుట్ర చేశారని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ మీద అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కుట్ర వల్లే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైందని చెప్పారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు తీసుకెళ్లే ప్లాన్ చివరి నిమిషంలో చార్టెడ్ ఫ్లైట్ ఆలస్యం వల్ల ఆగిపోవడం లాంటి అంశాలు చూస్తే.. ఇది ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కుట్ర అని అర్థమవుతుందని అన్నారు.
మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీ పదవికి మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ పత్రాలను ఆ రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఢిల్లీలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అత్యంత నిజాయితీపరురాలైన మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమే అవుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం కోర్టు నోటీసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఎక్కడా లేదని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు.

