కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)పై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధానికి ఆ పేరు నిర్ణయించడం వెనుక కారణం, పేరు ఎవరు సూచించారన్న విషయాలను ప్రజలతో పంచుకున్నారు. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని కట్టేందుకు రైతులను భూములు అడిగానని, మీ భూములు ఇస్తే రాజధాని కట్టి వాటికి విలువ పెంచుతానని చెప్పానని గుర్తు చేశారు. తన మాటపై నమ్మకం ఉంచి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. రాజధాని కట్టాలి అనుకున్నప్పుడు అమరావతి అనే పేరును రామోజీరావు సూచించినట్లు సీఎం వెల్లడించారు. అమరావతికి గొప్ప చరిత్ర ఉందని, అది దేవతల రాజధాని అని అదే పేరును రాజధానికి ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.
రాజధానికి దేశంలోని 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దేశంలో అమరావతిని వ్యతిరేకించిన ఒకే ఒక్క పార్టీ సైకో పార్టీ అని విమర్శించారు. ఆ పార్టీ అధినేతనే సైకో అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా సైకో పార్టీ అని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు రాజధాని పేరుతో మూడు ముక్కల ఆట ఆడి ఇప్పుడు మావిగన్ (MAVIGUN) అంటున్నాడని, ఇంకా వాటికన్ అనలేదని సెటైర్లు వేశారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ (YS Jagan) లాంటి వ్యక్తిని ప్రజలు ఇంకా నమ్మరని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో పాస్ బుక్లను ఎవరూ తారుమారు చేయలేరని సీఎం చంద్రబాబు (CM Chandrababu) వెల్లడించారు. మనం ఉపయోగించే కరెన్సీకి వాడే టెక్నాలజీని పాస్బుక్లకు వాడినట్లు తెలిపారు. వేమూరు నియోజకవర్గంలో 1795 పాస్ పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: మావిగన్ అమలు చేస్తే ప్రపంచంతో పోటీ పడొచ్చు: తమ్మినేని సీతారాం
Follow Us On: X(Twitter)

