కలం, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపించినట్లు డీజీపీ సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం డీజీపీని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విజయవాడకి చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను మే 9వ తేదీన కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత అతడు కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ నెల 29వ తేదీలోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపర్చాలని ధర్మాసనం ఆదేశించడంతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
సాయికృష్ణను చంపేశారు: తల్లి
తన కుమారుడిని సీఐ నాగరాజు చంపేశాడని సాయికృష్ణ తల్లి ఆరోపించడం సంచలనంగా మారుతోంది. తన కుమారుడిని కలవడానికి వెళ్లినప్పుడు బూతులు తిట్టాడని, నీ కొడుకుని చంపేస్తా.. దండ రెడీ చేసుకో.. బయటకు వెళ్లు అని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ గోళ్లు పీకేశారని, అయిదుగురు పోలీసులు అతడ్ని దారుణంగా కొట్టారని కన్నీరుమున్నీరుగా విలపించారు. సాయికృష్ణ ఏమైపోయాడనేది ఇంతవరకు తెలియరాలేదు.
Read Also: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
Follow Us On: X(Twitter)

