కలం, వెబ్ డెస్క్ : విశాఖ కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరిపోయింది. దేశమే కాదు.. మొత్తం ప్రపంచమే వైజాగ్ వైపు తిరిగి చూసేలా వరల్డ్ టాప్ డేటా సెంటర్ కు తొలి అడుగుపడింది. ప్రతిష్టాత్మకమైన విశాఖ గూగుల్ డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు (CM Chandrababu) శంకుస్థాపన చేశారు. తర్లువాడలో సుమారు 266 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ (Google Data Center) శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్, ఐటీ మంత్రి నారా లోకేష్ , గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
మొత్తం రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. 2028 నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగ పెట్టుకున్నారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖలో అడుగు పెట్టడం వల్ల ప్రపంచ దేశాల దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లుతోంది. ఈ డేటా సెంటర్ రాకతో రానున్న కాలంలో 1.88 లక్షల ఉద్యోగావకాశాలు రానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

