కలం, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati)లో నేడు సాగునీటి రంగంపై కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాగునీటి సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో అమరావతి రాయపూడి పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు, పెండింగ్లో ఉన్న రూ.18 వేల కోట్ల బిల్లుల బకాయిల చెల్లింపు, అలాగే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా సమీక్ష జరగనుంది.
అదే విధంగా నీటి భద్రత, వాటర్ మేనేజ్మెంట్, భూగర్భ జలాల పెంపు అంశాలపై సాగునీటి సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్లో నీటి వనరుల సమర్థ వినియోగం, రైతులకు సాగునీటి సరఫరా మరింత మెరుగుపడేలా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు హాజరుకానుండగా, సాగునీటి రంగంపై ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా తెలియజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.


