కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మహిళా భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా అమరావతిలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. గత ఐదు సంవత్సరాలు గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లతో మహిళలకు రక్షణ లేకుండా ఉండేదన్నారు. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. చంద్రన్న ఉన్నంత వరకు ఆడపిల్లలకు ఎలాంటి భయం అక్కర్లేదన్నారు. ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాలని, అన్యాయం జరిగినప్పుడు ఎదురించాలని సూచించారు.
మహిళా సంఘాలు దుర్మార్గాలను కట్టడి చేయాలని చెప్పారు. తాగుబోతులు, గంజాయి బ్యాచ్ విషయంలో కూడా చొరవ తీసుకోవాలని సూచించారు. హోం మంత్రి అనిత కూడా ఓ ఆడబిడ్డే అని, ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా మహిళలు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. హోం మంత్రి అనితతో సహా ముగ్గురు మహిళా మంత్రులు నిబద్ధతతో పని చేస్తున్నారని సీఎం ప్రశంసించారు.
30 సంవత్సరాలకు ముందు రాజకీయాల్లో ఉండి తన భార్య భువనేశ్వరిని కంపెనీకి వెళ్లాలంటే మొదట్లో ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత వెళ్లి ఇప్పుడు 30 ఏళ్లుగా విజయవంతంగా పరిశ్రమ నడుపుతోందని వెల్లడించారు. గొప్ప పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఇక కోడలు బ్రహ్మణి కూడా పారిశ్రామిక వేత్తగా ఎదిగిందని, ఎంతో గౌరవంగా బతుకుతున్నామని చెప్పారు. హెరిటేజ్ డబ్బులు వస్తాయని, ఇంటికి సరిపోతాయని వెల్లడించారు. ఇలా ప్రతి ఒక్కరూ పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

