కలం, వెబ్ డెస్క్ : పోలవరం జిల్లా చింతూరు మండలం బొడుగూడెం సమీపంలో జాతీయ రహదారి-30పై ఘోర ప్రమాదం (Chintoor Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు, ఐరన్ లోడ్తో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు క్షణాల్లోనే కారులో భారీగా మంటలు చెలరేగాయి.
ఈ దుర్ఘటనలో కారులో ఉన్న రంగారెడ్డి జిల్లా మియాపూర్ వాసి సూర్య వినయ తేజ (28) సజీవ దహనమయ్యాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల అయ్యన్న (35)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

