కలం, జనగామ: మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలి (Child Died) తీసుకుంది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ లీకవుతోంది. దీంతో మరమ్మతులు చేద్దామని సిబ్బంది 20 రోజుల కిందటే గుంత తవ్వారు. మళ్లీ పూడ్చకుండానే అలాగే వదిలేశారు. ఈ క్రమంలో పాఠశాలలో అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్న కవిత కుమార్తె మోక్షిత (5) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. గమనించిన సోదరి దీక్షిత విషయాన్ని తల్లికి చెప్పగా.. ఇరుగు పొరుగుతో కలిసి బయటకు తీసినప్పటికీ అప్పటికే మరణించింది.
మృతదేహంతో గ్రామస్థుల ఆందోళన..
కన్న కూతురు చనిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

