కలం, స్పోర్ట్స్ : గ్లోబల్ చెస్ లీగ్ ముగిసిన వెంటనే 46వ చెస్ ఒలింపియాడ్ కోసం సమర్కండ్లో అడుగుపెట్టిన భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో దిగిన ఐదు గంటలైనా క్రీడాకారులకు బస చేయడానికి గదులు కేటాయించలేదు. ఈ దారుణమైన వసతి సమస్యను భారత జట్టు కెప్టెన్, కోచ్ శ్రీనాథ్ నారాయణన్ (Srinath Narayanan) సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా నిరసించారు. గ్లోబల్ చెస్ లీగ్లో నిహాల్ సరిన్ సమయభావంతో ఓడిపోయి భావోద్వేగానికి గురైనప్పుడు, శ్రీనాథ్ నారాయణన్ అతనికి అండగా నిలిచి ధైర్యాన్ని నింపారు.
ఆ తర్వాత జట్టును ముందుకు నడిపించి కాంస్య పతకం సాధించేలా చేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఒలింపియాడ్ సమరానికి జట్టును సమాయత్తం చేస్తున్నారు. అయితే సమర్కండ్లో దిగగానే ఎదురైన ఈ నిర్వహణ లోపంపై ఆయన ఎక్స్ (X) వేదికగా నేరుగా అసహనం వ్యక్తం చేశారు. FIDE నిర్వహణ తీరుపై ఆయన ఆవేదన చెందారు. శ్రీనాథ్ సోషల్ మీడియాలో నిరసన వ్యక్తం చేసిన వెంటనే నిర్వాహకులు స్పందించారు.
క్రీడాకారులందరికీ వ్యక్తిగత గదులు కేటాయించారు. అలాగే కోచింగ్ సిబ్బందికి భాగస్వామ్య గదులు ఏర్పాటు చేశారు. సమస్య తాత్కాలికంగా సమసిపోవడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఈ వివాదం సద్దుమణగడంతో భారత జట్టు తమ దృష్టిని పోటీలపై పెట్టింది. జట్టులోని ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరిన్, గుకేష్, విదిత్ గుజరాతీ మంచి ఫామ్లో ఉన్నారు.

