కలం, స్పోర్ట్స్ : చెస్ ఒలింపియాడ్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మహిళల విభాగంలో కొనేరు హంపీ (Koneru Humpy) అదరగొట్టారు. గ్రీస్ స్టార్ స్టావ్రౌలా ట్సోలకిడౌను ఓడించారు. దీంతో భారత్ మహిళల జట్టు గ్రీస్పై 3.5-0.5తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీలో భారత జట్టు అజేయంగా కొనసాగుతోంది. హంపీ, ట్సోలకిడౌ మధ్య మ్యాచ్పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇటీవల జరిగిన గ్లోబల్ చెస్ లీగ్లో ట్సోలకిడౌ హంపీపై పైచేయి సాధించారు. అయితే ఈసారి క్లాసికల్ చెస్లో హంపీ సత్తా చాటారు. వైట్ పావులతో బరిలోకి దిగిన హంపీ మొదటి నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు.
క్రమంగా ఒత్తిడి పెంచుతూ కీలక దశలో మెటీరియల్ ఆధిక్యం సాధించారు. చివరికి 46వ ఎత్తు తర్వాత ట్సోలకిడౌ ఓటమిని అంగీకరించారు. మరోవైపు భారత మహిళల జట్టులో వంతిక అగర్వాల్, సావిత శ్రీ కూడా గెలిచారు. దివ్య దేశ్ముఖ్ తన గేమ్ను డ్రా చేసుకున్నారు. వైశాలి రాంబాబు ఈ రౌండ్లో విశ్రాంతి తీసుకున్నారు. దీంతో గ్రీస్పై భారత్ 3.5-0.5తో మ్యాచ్ను ముగించింది. పురుషుల విభాగంలో ప్రపంచ ఛాంపియన్ డీ గుకేశ్ కూడా తిరిగి గెలుపు బాట పట్టారు. ఇటలీకి చెందిన సబినో బ్రునెల్లోను గుకేశ్ ఓడించారు.
33 ఎత్తుల్లోనే గేమ్ను ముగించారు. దీంతో గత రౌండ్లో కోల్పోయిన 2700 రేటింగ్ మార్క్ను గుకేశ్ తిరిగి దాటారు. ఇతర భారత ఆటగాళ్లలో నిహాల్ సరీన్ విజయం సాధించారు. ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి తమ గేమ్లను డ్రా చేసుకున్నారు. దీంతో ఇటలీపై భారత పురుషుల జట్టు 3-1తో విజయం సాధించింది. మూడో రౌండ్లో పురుషుల, మహిళల రెండు జట్లూ విజయాలతో ముందుకు సాగాయి.

