కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా అనేక రకాల పన్నులుంటే వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడానికి పుట్టుకొచ్చిందే జీఎస్టీ. వన్ నేషన్ – వన్ టాక్స్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేస్తున్నది. కానీ ఇప్పుడు దానికి అదనంగా మరో కొత్త టాక్స్ ఉనికిలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా ఆచరణలో మాత్రం ఇది అమలవుతున్నది. హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్ చేసినా, పార్సిల్ తీసుకున్నా దీన్ని కట్టాల్సిందే. చెన్నై నగరంలో అమలవుతున్న ఈ టాక్స్ వింతగా అనిపిస్తున్నా జనాన్ని మాత్రం బాదేస్తున్నారు వ్యాపారులు. ఆలోచన ఉండాలేగానీ ఆదాయం ఆర్జించడానికి మార్గాలు అనేకం. ఇప్పుడు అదే చెన్నై నగరంలో వర్కవుట్ అవుతున్నది. ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో ఏర్పడిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాతో ఇబ్బంది పడుతున్న వ్యాపారులు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
గ్యాస్ టాక్స్ పేరుతో జనంపై బాదుడు :
కమర్షియల్ సిలిండర్లకు కొరత ఏర్పడడంతో అటు హోటళ్లను మూసేయలేక.. ఇటు నష్టాలతో నడిపించుకోలేక సతమతమవుతున్న వ్యాపారులు ‘గ్యాస్ టాక్స్’ (Gas Tax) పేరుతో కొత్త వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. ఎలాగూ జీఎస్టీ పేరుతో స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ వసూలు చేస్తున్నా కొత్తగా గ్యాస్ పేరుతో అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఒక ప్లేట్ ఇడ్లీ రేటును రూ. 33.33గా పేర్కొన్న ఓ హోటల్ ఆ ధర మీద 15 శాతాన్ని గ్యాస్ టాక్స్ (Gas Tax) పేరుతో వసూలు చేస్తున్నది. దీనికి అదనంగా 5% మేర జీఎస్టీని వసూలు చేస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ టాక్స్ విధానాన్ని తీసుకురాకపోయినా వ్యాపారులు మాత్రం దీన్ని కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారు. ఇది ఒక్క హోటల్కు మాత్రమే పరిమితమా?.. లేక అన్ని హోటళ్లూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నాయా?.. చెన్నై నగరంలో మాత్రమే ఈ విధానమా?.. రానున్న రోజుల్లో ఇతర నగరాలకూ పాకుతుందా?.. వేచి చూడాల్సిందే.

