కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) సమీపంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇగట్టూర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన వైతియానాధన్ (34) ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెలవు రోజు కావడంతో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు ఇగట్టూర్లోని ఒక మైదానానికి వెళ్లాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బ్యాటింగ్ చేస్తూ ఒక రన్ పూర్తి చేశాడు. అనంతరం రెండో రన్ కోసం పిచ్పై వేగంగా పరిగెడుతుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అది చూసి షాక్కు గురైన తోటి ఆటగాళ్లు, స్నేహితులు వెంటనే వైతియానాధన్ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించారు. ఆట స్థలంలోనే ప్రాణాలు కోల్పోవడంతో వైతియానాధన్ కుటుంబంలో, స్నేహితుల్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

