కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు కేవలం డాన్సులు, సొల్లు కబుర్లతోనే కాలక్షేపం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దాన్ని కాస్తా ‘సూపర్ సున్నా’గా మార్చేశారని ఫైర్ అయ్యారు.
అంతేకాదు ఈ రెండేళ్లలో ప్రధాని మోదీ ఎదురైతే వంగి వంగి దండాలు పెట్టడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తే కూర్చోబెట్టి ముచ్చటించడం తప్ప చంద్రబాబు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. మైక్ దొరికితే.. జగన్ సైకో అని, వైసీపీ గొడ్డలి పార్టీ , గాడిద గుడ్డు అంటూ నిందలు వేయడం తప్ప చంద్రబాబు ప్రజలకు చేసిందేంటి? అని ప్రశ్నించారు. బాబు మార్కు పాలనపై ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని .. కేవలం ప్రచార ఆర్భాటాలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిందేమీ లేదని మండిపడ్డారు.

