కలం, వెబ్ డెస్క్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించిన విషయాలపై కేసీఆర్ మీడియాకు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్పై ప్రధానంగా చర్చించామని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్రాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 308 కిలోమీటర్ల పాటు కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ ఈ జిల్లాకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. ఉమ్మడి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఈ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. “పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్ట్ కాదని.. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యునల్ ప్రకటించింది. సమైక్య పాలకులు కేటాయించకున్నా సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్ నీళ్లు కేటాయించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ఎంతో ద్రోహం చేస్తున్నాయి. పాలమూరు జిల్లాకు ఎంత అన్యాయం జరిగిందో కొత్త తరానికి తెలియదు” అని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొని ఈ జిల్లాకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఆయన పునాధి రాళ్లు వేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. తాను ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఈ విషయం ప్రస్తావించానని చెప్పారు.
Read Also: బీఆర్ఎస్ లో ఉంటూ పార్టీకే నమ్మకద్రోహం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి
Follow Us On: Youtube


