కలం, వెబ్ డెస్క్: దేశంలో తీవ్రవాదం ముప్పును అంతం చేయడానికి ‘ప్రహార్’ (Prahaar) పేరుతో కేంద్రం కొత్త పాలసీ ప్రకటించింది. ఆధునిక ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి ముందస్తు జాగ్రత్తలు, నివారణ, తక్షణ ప్రతిస్పందన, వివిధ సంస్థల మధ్య సమన్వయం, చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలతో దీనిని రూపొందించింది. ఈ మేరకు కొత్త జాతీయ ఉగ్రవాద వ్యతిరేక విధానం ‘ప్రహార్’ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ‘ఉగ్రవాదానికి జాతి, మతం, ప్రాంతం అనే తేడాలు లేవు. భారత్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. హింసను ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమనే జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది’ అని హోంమినిస్ట్రీ పేర్కొంది.
ప్రహార్ ప్రధాన లక్ష్యాలివీ..
- ఉగ్రదాడులు జరగకముందే అడ్డుకోవడం
- కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం బలోపేతం చేయడం.
- చట్టాలను పాటిస్తూ, మానవ హక్కులను రక్షించడం.
- తీవ్రవాదానికి సానుకూల పరిస్థితులను తగ్గించడం
- టెర్రరిజాన్ని ఎదుర్కోవడానిక అంతర్జాతీయంగా భాగస్వాములతో కలసి పనిచేయడం.
- ఉగ్రవాద బాధితులు, ప్రాంతాలు త్వరగా కోలుకునేలా చేయడం.
- లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఎదురవుతున్న టెర్రరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టడం.
- ఉగ్రముప్పును నివారించడానికి డ్రోన్లు, డిజిటల్ మాధ్యమాలను వాడడం.
- రసాయన, జీవ, అణు, సైబర్ ముప్పులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం.
సాంకేతికత, సమన్వయం కీలకం..
భద్రతా దళాలకు శిక్షణ విధానాలు ఆధునీకరించడం, సాంకేతిక సామర్థ్యాలు పెంపొందించడం, విధి నిర్వహణలో ఏకరీకరణ తీసుకురావడం, రాష్ట్ర స్థాయి ఉగ్రవాద నిరోధక విభాగాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సమన్వయంతో కూడిన జాతీయ ప్రతిస్పందన వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఉగ్ర ముప్పులను ఎదుర్కొనే సమాజాన్ని నిర్మించడమే ‘ప్రహార్’(Prahaar) విధానం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.


