కలం, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన 90 రోజుల తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. అంతర్జాతీయంగా చమురు సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాలు, అలాగే వాణిజ్య వినియోగదారులు రిటైల్ బంకుల నుండి పెద్ద మొత్తంలో బల్క్ కొనుగోళ్లు జరుపుతుండటాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల డీజిల్ పరిమితి విధించింది. ప్రధానంగా మార్కెట్లో ఇంధన బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, డైవర్షన్ వంటి సమస్యలను నివారించడంతో పాటు స్థానికంగా పెట్రోల్, డీజిల్ (Petrol Diesel Supply) కొరత రాకుండా చూడటమే ఈ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ కొత్త నిబంధనల ప్రకారం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం రిటైల్ అవుట్లెట్ల నుండి జరిపే భారీ కొనుగోళ్లను క్రమబద్ధీకరిస్తారు. అయితే, ఈ ఆర్డర్ వల్ల సాధారణ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు తమ వాహనాలకు ఎప్పటిలాగే ఎలాంటి ఆంక్షలు లేకుండా పెట్రోల్, డీజిల్ నింపుకోవచ్చని, సామాన్య వినియోగదారులకు నిరంతరాయంగా ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకే ఈ చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ కొత్త తాత్కాలిక సరఫరా నియంత్రణ ఉత్తర్వులను విడుదల చేసింది.

