కలం, మెదక్ బ్యూరో : బోనాల ఉత్సవాల సందర్భంగా జంతుబలి ఇచ్చిన సంఘటనపై మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu) పై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగలో నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో దున్నపోతును బలి ఇచ్చారు. అంతేకాకుండా, ఈ జంతుబలికి సంబంధించిన వీడియోలను ఆయన తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోలను చూసిన జంతు హక్కుల కార్యకర్త ఏదులాపురం గౌతమ్ వెంటనే స్పందించి, పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా జంతుబలి ఇవ్వడమే కాకుండా దానిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా వీడియోలను పరిశీలించిన పటాన్చెరు సీఐ రవీందర్, నీలం మధు ముదిరాజ్ తో పాటు నిర్వాహకులపై పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

