కలం, నిర్మల్ : మామడ మండలం పొన్కల్ (Ponkal) గ్రామంలో నాటు బాంబు పేలడంతో ఓ గేదె తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రైతు బర్లపాటి శ్రీనివాస్కు చెందిన గేదె ఎప్పటిలాగే మేత కోసం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లగా, అడవి జంతువుల వేట కోసం అమర్చినట్లు భావిస్తున్న నాటు బాంబును ఆహారంగా భావించి కొరకడంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో గేదె నోరు, దవడలు, నాలుక తీవ్రంగా దెబ్బతినడంతో తీవ్ర వేదనకు గురైంది.
గేదె విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని, ఈ ఘటనతో ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకుని తగిన నష్టపరిహారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అటవీ ప్రాంతాల్లో అడవి జంతువుల వేట కోసం నాటు బాంబులు వినియోగించడం వల్ల మూగజీవాలు, ఇతర జంతువులు బలవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

