కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో సభ ప్రారంభానికి ముందే బీఆర్ఎస్ (BRS) సభ్యుల నిరసనలు, ఆందోళనలు మొదలయ్యాయి. రాష్ట్రానికి కొత్తగా వచ్చిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి ప్రసంగానికి ముందు ప్రభుత్వంపై బీఆర్ఎస్ విరుచుకుపడడంపై చర్చ మొదలైంది. మొదటి రోజు నెలకొన్న పరిస్థితులతో ఈ సెషన్ మొత్తం గందరగోళం నడుమనే జరగనుందని స్పష్టమవుతోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి బడ్జెట్ సెషన్ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం నిరసనలతోనే యాక్టివిటీస్ మొదలుపెట్టింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలు గన్ పార్కు దగ్గర అమరవీరులకు నివాళి అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. గన్ పార్కు దగ్గర నివాళులు అర్పించిన సందర్భంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పలు రకాల నినాదాలు చేశారు గులాబీ ఎమ్మెల్యేలు.
రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్కు వెయ్యి కోట్లు అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాహుల్ బంధు కాదురా… రైతుబంధు కావాలి.. అంటూ సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. పెన్షన్లు పెంచే మాట మరిచారు.. పేదవాళ్ల నడ్డి విరిచారు.. అంటూ విమర్శలు చేశారు. మహాలక్ష్మి పథకం మాట మరిచారు.. మహిళలను నట్టేట ముంచారు.. అంటూ గన్ పార్క్ దగ్గర తమదైన శైలిలో నినాదాలతో హోరెత్తించారు.

