కలం, ఖమ్మం బ్యూరో : కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీలో తెలంగాణకు (Telangana) అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ఆరోపించారు. ఈ అంశంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తగూడెం క్లబ్ హాల్లో జరిగిన ‘ఈ-క్లాస్ యాప్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై యాప్ను ప్రారంభించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ యాప్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం అంశంపై గతంలో కేసీఆర్ స్పష్టమైన వైఖరి వెల్లడించారని గుర్తు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నదీజలాలను తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో గళం విప్పుతారని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సాధనలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు. యువతలో అసంతృప్తి పెరుగుతోందని, ప్రభుత్వ విధానాలపై ప్రజలలో ఆగ్రహం ఉందని పేర్కొన్నారు. కొత్తగూడెం ప్రాంత అభివృద్ధిపై మాట్లాడుతూ, రైల్వే, రహదారి ప్రాజెక్టుల విస్తరణకు బీఆర్ఎస్ తరపున కేంద్రానికి నివేదికలు సమర్పించినట్లు తెలిపారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ధి, భద్రాచలం–బస్తర్–మల్కాన్గిరి రైల్వే మార్గ విస్తరణ, అలాగే 4 లేన్ల రహదారి అభివృద్ధి అంశాలను పార్లమెంటులో ప్రస్తావించినట్లు చెప్పారు. త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని, యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కేటీఆర్ పాదయాత్ర చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

