కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Former Minister Gangula Kamalakar) నిప్పులు చెరిగారు. ఈ బడ్జెట్లో స్కీమ్లు మరిచి, స్కామ్లకు తెరలేపారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బీసీలకు నిధులు కేటాయించకుండా గొంతు కోశారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీతో తులం బంగారం వస్తుందని అందరు భావించారని.. ఈ బడ్జెట్ చూసిన తర్వాత ప్రభుత్వ డొల్లతనం మొత్తం బయటపడిందన్నారు. బడ్జెట్ అంతా మోసమని, రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా బడ్జెట్ లేదని ఫైర్ అయ్యారు. దళితులకు కేటాయించే బడ్జెట్ను కుదించారని, దళితులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీనవర్గాల హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బడుగు బలహీనవర్గాలు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. నిరాశాజనకంగా బడ్జెట్ ఉందన్నారు. బీసీలకు అన్యాయం చేసేవిధంగా బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకముందు అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు.. చెవిలో పూలు పెట్టుకొని నిరసన చేపట్టారు. ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని మండిపడ్డారు. దివ్యాంగులకు బాకీ పడ్డ రూ. 54,000 ఎక్కడని నిలదీశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ. 4,000 చొప్పున మొత్తం రూ. 54,000 బాకీ పడ్డారని చెప్పారు. పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని నిలదీశారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి రూ. 12,000 చొప్పున, రెండు సంవత్సరాలకు గాను రూ. 24,000 బాకీ ఉందన్నారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: HYDలో విలువైన భూములపై కన్నేశారు: కేపీ వివేకానంద
Follow Us On: Facebook

