కలం, వెబ్ డెస్క్: తెలంగాణ బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget) ద్వారా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారని మండిపడ్డారు. కేవలం వాళ్లు స్కాములు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదన్నారు. ఈ బడ్జెట్లో ఆరు గ్యారంటీల ఊసే లేదని, విద్యా ప్రమాణాలను పెంచేలా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.
కేవలం భవనాలు, హ్యామ్ (HAM) రోడ్ల పనులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించారని ఆరోపించారు. ఈ బడ్జెట్ కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బడ్జెట్లా కనిపిస్తోందని ఆరోపించారు. సామాన్య ప్రజలకు మేలు చేసే అంశాలు ఇందులో ఏవీ లేవని, ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

