కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ 420 హామీల వైఫల్యంలో మొదటి ముద్దాయి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబేనని మంథని మాజీ ఎమ్మెల్యే, నాయకులు పుట్ట మధూకర్ (Putta Madhukar) ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో “420 హామీల” ఫ్లెక్సీ ప్రదర్శించి ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఒక్క హామీ పూర్తి చేయలేదు..
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి 1000 రోజులు దాటినా ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. మేనిఫెస్టోను తానే రూపొందించానని గొప్పలు చెప్పుకున్న దుద్దిళ్ల శ్రీధర్, దాని అమలు గురించి ప్రశ్నిస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం దారుణమన్నారు. రూ.2,500 మహిళా భరోసా, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇండ్లు వంటి గ్యారెంటీలు ఏవీ సరిగ్గా అమలు కాలేదన్నారు. సొంత ఊరి పాఠశాలలో కనీస వసతులు కల్పించలేని శ్రీధర్ బాబు, మంథని ప్రజలను మోసం చేస్తూ నియోజకవర్గానికి అపకీర్తి తెస్తున్నారని విమర్శించారు. శ్రీధర్ బాబు వెంటనే అంబేద్కర్ చౌరస్తాలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసమర్థ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్: జక్కు శ్రీహర్షిణి
జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా అబద్ధాలతోనే శ్రీధర్ బాబు గెలుస్తున్నారని విమర్శించారు. ఆయన రాసిన మేనిఫెస్టో తెలంగాణ అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మండిపడ్డారు. ఐటీ మంత్రిగా ఉండి 10 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసేవరకు BRS పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

