కలం మెదక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్చెరు (Patancheru) నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పటాన్చెరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద, భారతీనగర్ డివిజన్లోని LIG బస్టాప్, రామచంద్రాపురం బాలవిహార్ పార్క్ సమీపంలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో చారిత్రాత్మక పాత్ర పోషించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందిందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిందని తెలిపారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల సృష్టి వంటి అంశాల్లో పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

