కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకంపై బ్రిటన్ (Britain) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతను రక్షించే లక్ష్యంతో 16 ఏండ్ల లోపువారికి సోషల్ మీడియా సైట్లను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధించనుంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సోమవారం ప్రకటించారు. గేమింగ్, లైవ్స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లపై కూడా కఠినమైన ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. పిల్లల క్షేమం దృష్ట్యా ఈ పూర్తి నిషేధమే సరైన నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఏడాది 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను (Social Media) నిషేధిస్తూ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే దీనివల్ల కలిగే మానసిక ఆరోగ్య ప్రమాదాలపై తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే బ్రిటన్ ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఈ నూతన ఆంక్షలపై బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత నుండి దాదాపు 1,16,000కి పైగా అభిప్రాయాలను సేకరించింది. ఇందులో పాల్గొన్న తల్లిదండ్రులలో 83 శాతానికి పైగా ప్రజలు సోషల్ మీడియా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేయగా, 90 శాతం మంది సోషల్ మీడియా యాక్సెస్ కోసం కనీస వయస్సు 16 ఏళ్లు ఉండాలనే తెలిపారు.

