కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit) ముగిసింది. న్యూ ఢిల్లీ డిక్లరేషన్తో సమావేశాలు ముగిసినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు దేశ రాజధానిలో జరిగిన ఈ సదస్సుకు రష్యా, చైనా అధ్యక్షులతో పాటు 11 మంది దేశాధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై కీలక సమీక్షలు నిర్వహించారు. బ్రిక్స్ కూటమి ఐక్యతను ఎంతగానో ప్రశంసించిన మోదీ.. 2027లో చైనాలో బ్రిక్స్ సదస్సు జరగబోతుందని ప్రకటించారు.
భారత్ భారీ దౌత్య విజయం..
ఢిల్లీ బ్రిక్స్ సదస్సులో భారత్ భారీ దౌత్య విజయం సాధించింది. అన్ని దేశాలను ఏకతాటి మీదకు తీసుకొచ్చి.. తాను ప్రతిపాదించిన డిక్లరేషన్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపేలా చేసింది. అంతేగాకుండా, పహల్గాం ఉగ్ర దాడిని ఖండించడం ద్వారా.. పాకిస్థాన్కు షాక్ ఇచ్చింది. ఈ సమావేశాల్లో రష్యా, చైనా అధ్యక్షులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
మూడు రోజుల కిందటే ఢిల్లీ చేరుకున్న పుతిన్.. మోదీతో సుదీర్ఘ చర్చలు జరిపారు. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్తో ఏడేళ్ల విరామం తరువాత మోదీ ముఖాముఖి సమావేశమయ్యారు. సరిహద్దుల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు జిన్ పింగ్ కూడా సానుకూలంగా స్పందించారు. మొత్తంగా భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన బ్రిక్స్ సదస్సు ఘనంగా ముగిసింది.

