కలం, నిర్మల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్(Nirmal Collector) భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, పరస్పర సహకారం, ఐకమత్యంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఉత్సవాల సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణహిత నిమజ్జనానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, ఇతర అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను అధికారుల సూచనల మేరకు నిర్దేశిత ప్రదేశాల్లోనే సురక్షితంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ప్రజలు సంయమనం పాటిస్తూ భక్తి, ఐకమత్యంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

