కలం, జగిత్యాల: విద్యార్థులపై విద్యా ఫీజుల భారాన్ని తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల (Jagtial)లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరిట జిల్లా అధ్యక్షుడు ఇట్టేడి రాజు (శేఖర్ రెడ్డి) నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బోగ శ్రావణి పాల్గొన్నారు.
ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి..
ఈ సందర్భంగా భోగ శ్రావణి మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమం ప్రారంభించామని.. అందరి అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామని తెలిపారు. 8239523455 నంబర్కు మిస్ట్ కాల్ ఇచ్చి ఉద్యమానికి మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు. తక్షణమే ఫీజుల నియంత్రణ చేపట్టి, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల చేయాలన్నారు. బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, దిటి వెంకటేష్, ఆముద రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

