కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor)పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ (BJP vs Congress) నేతల పోటాపోటీ సవాళ్లతో నియోజకవర్గం హీటెక్కింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) , కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి (Vinay Kumar Reddy) , నాయకుల హౌజ్ అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చలో అంకాపూర్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వినయ్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలోనే ఉన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇద్దరు నాయకుల నివాసాల వద్ద కార్యకర్తలు, నాయకుల నినాదాల హడావుడితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు బయటకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
ఆర్మూర్ అంతటా అరెస్టులు
మరోవైపు నందిపేట్, డొంకేశ్వర్, మాక్లూర్, ఆర్మూర్, ఆలూర్ మండలాల్లోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు కీలక నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఐదుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

