కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు (BJP Corporators) బండ రమణారెడ్డి, తోట అనిల్, ఎన్నం లక్ష్మీ ప్రకాష్, కర్రె పద్మలు సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ఈనెల 15న ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో నగరంలోని అన్ని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రధానంగా త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుదీకరణ, తరగతి గదిలో మరమ్మత్తులను నిర్వహించాలన్నారు. మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్లు, రక్షణ గోడలు తదితర విషయాలపై అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా పాఠశాల ఆవరణలో భారీ వృక్షాల వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉందని, రాబోయే వర్షాకాలం, ఈదురు గాలులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ వృక్షాలను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై అధికారులు, విద్యాశాఖ వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: మీ ఇంటి ముందే ప్రెస్ మీట్ పెడతా.. కవితకు రఘనందన్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

