కలం, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ (Bidar) ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో సంచలన ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి మార్చురీలో పనిచేస్తున్న అటెండెంట్ సైకోలా వ్యవహరించాడు. మార్చురీలో భద్రపరిచిన మహిళా మృతదేహాల దుస్తులను తొలగించి నగ్న ఫొటోలు తీస్తూ దొరికిపోయాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన వైద్య వర్గాలతో పాటు ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.
మునీర్ అహ్మద్ చాలా రోజులుగా ఆసుపత్రి మార్చురీలో అటెండెంట్గా పనిచేస్తున్నాడు. అయితే పోస్ట్మార్టం కోసం వచ్చిన మహిళా మృతదేహాలపై ఉన్న దుస్తులను తొలగించి, వాటి నగ్న చిత్రాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ వైద్యుడు మొబైల్ ఫోన్ను పరిశీలించగా ఈ విషయం బయట పడింది. పలువురు మహిళా మృతదేహాలకు సంబంధించిన నగ్న ఫొటోలు కనిపించినట్లు సమాచారం. దీంతో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు మునీర్ అహ్మద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతడి మొబైల్లో ఉన్న ఫొటోలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వివిధ చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక మరిన్ని వివరాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: దేశాన్ని విభజించొద్దు.. రేవంత్కు కేంద్ర మంత్రి కౌంటర్
Follow Us On : WhatsApp

