కలం, కరీంనగర్ బ్యూరో: కులవృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని (PM Vishwakarma) అమలు చేస్తోందని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ భోగ శ్రావణి పేర్కొన్నారు. ఈ పథకం సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నదని తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేరు సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద అర్హులైన వారికి ఉచిత శిక్షణ అందించడంతోపాటు శిక్షణ పూర్తయిన అనంతరం అవసరమైన కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే శిక్షణ కాలంలో లబ్ధిదారులకు స్టైఫండ్ కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వయం ఉపాధికి రుణ సదుపాయం
శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి కోసం షాపులు లేదా ఇతర వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పించి వారికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనే ఆసక్తి చూపుతున్నప్పటికీ ఈ పథకం గురించి ఇంకా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన వారిని గుర్తించి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తన వంతు సహకారం కూడా అందిస్తానని తెలిపారు.
నిరుద్యోగులకు ఈ పథకంతో ప్రయోజనం
ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లక్ష్యమని, ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందని డాక్టర్ భోగ శ్రావణి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్,42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, ఆముదరాజు, కాశెట్టి తిరుపతి, సిరిపురం శ్రీనివాస్, రాగిళ్ళ సత్యనారాయణ, రాజుల నారాయణ, శ్రీనివాస్, బోగ నరేష్ మేరు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, సంఘ నాయకులు, బీజేపీ నాయకులు, మహిళలు, యువత పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

