కలం, వనపర్తి: ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా రైతులకు ఇబ్బందులు కలగకుండా భీమా స్టేజి–2 (Bheema Stage 2) నుంచి దిగువ ప్రాంతాలకు బుధవారం సాగునీటిని విడుదల చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి కలిసి నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.. మాట్లాడుతూ భీమా స్టేజి–2 (Bheema Stage 2) ద్వారా సుమారు 92 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. రైతుల పొలాలు పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైన మేరకు నీటి సరఫరా కొనసాగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సాగునీరు, పెట్టుబడి సాయం, రుణమాఫీ, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. భీమా స్టేజి–2 ద్వారా విడుదలవుతున్న నీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ఫలితమేనని అన్నారు.
దూరదృష్టితో నిర్మించిన ప్రాజెక్టుల వల్లే నేటికీ లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త సాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు విడుదలవుతుండగా వాటి ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
Follow Us On : WhatsApp

