కలం, వెబ్డెస్క్: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) నేడు కర్ణాటకలో పర్యటించారు. రాయచూర్ జిల్లాలోని హట్టి గోల్డ్ మైన్ను సందర్శించారు. హట్టి గోల్డ్ మైన్స్ (Hutti Gold Mines) దేశంలోనే ప్రభుత్వ రంగానికి చెందిన ఏకైక బంగారం ఉత్పత్తి సంస్థగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్, బంగారం శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను భట్టి విక్రమార్క క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మైన్స్ అధికారులు బంగారం తయారీ విధానాన్ని భట్టికి వివరించారు. హట్టి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి రోజు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం తయారవుతుందని అధికారులు తెలిపారు. సింగరేణి సంస్థ వేలంలో దక్కించుకున్న ‘దేవదుర్గ బంగారం-రాగి ఖనిజ అన్వేషణ బ్లాక్’ కూడా ఈ హట్టి గోల్డ్ మైన్స్ సమీపంలోనే ఉంది. ఈ సందర్శనలో భాగంగా భట్టి విక్రమార్క భూగర్భ గనితో పాటు ఓపెన్ కాస్ట్ గనిని కూడా పరిశీలించారు. ఆయన వెంట సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్టలతో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

