కలం, వెబ్ డెస్క్: తెలంగాణను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్గా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఇండియా ఎనర్జీ, క్లైమేట్ సెంటరు (IECC)ని సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలపై నిపుణులకు వివరించి, వారి సహకారం కోరారు.
2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనం సాధించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ముందుకెళుతోందని.. తెలంగాణ కూడా అదే కోవలో పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రూపొందించాల్సిన విధానాల రూపకల్పన, విద్యుత్తు గ్రిడ్ల ఆధునికీకరణ, ఉద్గారాల తగ్గింపు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థల అనుసంధానం వంటి వాటిపై సమీక్షించారు.
భారీ పెట్టుబడులకు అవకాశం..
తెలంగాణలో క్లీన్ ఎనర్జీ రంగం భవిష్యత్తులో మరింత ఉన్నత అవకాశాలు కల్పించబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు. తాము ఇప్పటికే గ్రీన్ పవర్ పాలసీ కూడా ప్రకటించామని.. గ్రీన్ పవర్ ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలున్నాయని తెలిపారు. మరీ ముఖ్యంగా సోలార్ విద్యుత్తు రంగంపై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. అంతేగాకుండా, మహిళా సంఘాలను కూడా సోలార్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయడం వంటి వినూత్న కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తంగా ఇంధన రంగంలో సరికొత్త మార్పులతో ఇండియాకు తెలంగాణ నమూనాగా మారబోతుందన్నారు.

