కలం, వెబ్ డెస్క్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు విద్యుత్తు డిమాండ్ కూడా గరిష్ఠ స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అత్యవసర సమీక్ష చేశారు. ఏసీలు, కూలర్లు, వ్యవసాయ అవసరాలతో గ్రిడ్పై ఒత్తిడి అధికంగా పెరుగుతోందని అధికారులు వివరించారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో సీఎండీలు హరీష్, జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.
అదనపు విద్యుత్తు కొనుగోళ్లకు ఆదేశాలు..
రాష్ట్ర విద్యుత్తు అవసరాలు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తి కేంద్రాలు, జల విద్యుత్తు కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. అక్కడ లోటు కనుక ఉంటే.. వెంటనే పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. అత్యవసర సేవలు, ఆసుపత్రులు, తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగొద్దని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్తు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలని భట్టి (Bhatti Vikramarka) సూచించారు.
Read Also: మంచి మనసు చాటుకున్న వీహెచ్.. జీతం మొత్తం పేద విద్యార్థులకే!
Follow Us On: Instagram

