కలం, ఖమ్మం బ్యూరో: బీజేపీ నాయకులు తమ మాయమాటలతో రైతులను మోసం చేయాలని చూస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka) మండిపడ్డారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, ఉత్తర భారతదేశ రైతుల తరహాలోనే తెలంగాణ రైతులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.
మాజీ మంత్రి హరీష్ రావు కేవలం వార్తల్లో ఉండటం కోసమే నిరంతరం ప్రయత్నిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను చూశాకే ప్రజలు వారిని ఇంటికి పంపించారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక, ‘మా రాజ్యం పోయింది’ అనే ఈర్ష్యతోనే బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు అల్లుతూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.”బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నర ఏళ్లలోనే అంత కొనుగోలు చేసింది. దీనిపై మేము బహిరంగ చర్చకు సిద్ధం” అని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. పదేళ్లు మంత్రిగా చేసిన గౌరవాన్ని కాపాడుకోవాలని హరీష్ రావుకు హితవు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అందులో భాగంగానే రైతులకు ఉచిత విద్యుత్తో పాటు, ఈసారి ధాన్యానికి ఇచ్చే మద్దతు ధరపై అదనంగా బోనస్ కూడా అందిస్తున్నామని తెలిపారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన మొక్కజొన్న కొనుగోళ్లను తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని, మద్దతు ధరతో కొనుగోలు చేయడం వల్ల మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 25,000 వరకు అదనపు లాభం చేకూరిందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని వనరులన్నింటినీ పోగు చేసి రైతులు, నిరుద్యోగ యువత, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

