కలం, తెలంగాణ బ్యూరో : ఇంతకాలం అమెరికా విధించిన సుంకాలతో భారత్ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల ఎగుమతిపై ప్రభావం పడగా ఇప్పుడు ఇరాన్లోని యుద్ధంతో (Iran War) సరికొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ట్రంప్ సుంకాల (Trump Tariffs) నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తప్పపట్టడంతో ఎగుమతి-దిగుమతి ఇబ్బందులు తొలగిపోయినట్లేనని భారత్ భావించింది. దాన్నుంచి కోలుకునే లోపే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త సైనిక చర్యలతో భారత్కు మరో తరహా సంక్షోభం వచ్చిపడింది. దేశం నుంచి ఎగుమతి అవుతున్న బాస్మతి ధరలు (Basmati Rice Prices) గణనీయంగా పడిపోయాయి. మరోవైపు ఇరాన్లోని యుద్ధ వాతావరణంతో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధరలు పెరిగాయి. ఇవన్నీ ఒకవైపు ఉంటే గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత తక్షణ సమస్యగా ముందుకొచ్చింది.
సంకటంలో హర్యానా రైతులు :
భారత్ నుంచి ప్రతి ఏటా మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలకు హర్యానా రైతులు (Haryana Farmers) బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేస్తూ ఉంటారు. గత సంవత్సరం ఒక్క ఇరాన్ దేశానికే దాదాపు 10 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ ఏడాది కూడా ఎగుమతి అవుతూనే ఉన్నాయి. కొన్ని లక్షల టన్నుల బియ్యం నౌకల ద్వారా రవాణా దశలోనే ఉన్నాయి. ఇరాన్లో యుద్ధ పరిస్థితులు అన్లోడింగ్కు సంకటంగా మారింది. గతేడాది సరఫరా చేసిన బియ్యానికి అక్కడి బయ్యర్ల నుంచి పేమెంట్ రావడం అనుమానంగా తయారైంది. ఇప్పటికే ఒక్కో కిలోపైనే దాదాపు పది రూపాయల మేర ధర తగ్గిపోవడంతో క్వింటాల్పై అది రూ. 500 వరకు ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు నౌకల్లోనే ఉండిపోయిన బియ్యాన్ని అక్కడి బయ్యర్లు తీసుకుంటారో లేదో తెలియని అయోమయం నెలకొన్నది.
ఆఫ్గనిస్థాన్ షిప్మెంట్పైనా ఎఫెక్ట్ :
ఇరాన్లోని ఉద్రిక్త (Iran War) పరిస్థితి ఆ ఒక్క దేశానికి మాత్రమే కాక గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాల్లో ప్రభావం చూపుతున్నది. దీంతో ఇరాన్ నౌకాశ్రయం మీదుగ ఆఫ్గనిస్థాన్ చేరాల్సిన బాస్మతి బియ్యం లోడ్లు మార్గమధ్యలోనే నిలిచిపోయాయి. ఇరాన్లోని బందర్ అబ్బాస్ రేవులో నౌకలన్నీ నిలిచిపోయాయని, పరిస్థితి చక్కబడేంతవరకూ నౌకలు కదిలే పరిస్థితి ఉండకపోవచ్ని భారత్లోని రైస్ ఎక్స్ పోర్టర్స్ ఆందోళన పడుతున్నారు. ఒకవైపు పాత బకాయిల ఆందోళనతో పాటు యుద్ధ సమయంలో నౌకలకు ఇన్సూరెన్స్ వర్తించని కారణంగా ఇక్కడి నుంచి వెళ్ళిన లోడ్కు డబ్బులు వస్తాయో రావో అనే అనుమానాన్ని రైస్ ఎక్స్ పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం బాస్మతి రైస్లో 25% హర్యానా రైతులే సరఫరా చేస్తున్నారని గుర్తుచేశారు.
Read Also: యూకే సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి.. పశ్చిమాసియాను దాటిన యుద్ధం
Follow Us On: Youtube

