కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ “స్వచ్ఛ పాఠశాల” కార్యకర్తగా మారారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను “స్వచ్ఛ పాఠశాల” పేరుతో శుభ్రం చేసే పనికి శ్రీకారం చుట్టారు. తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలంతా కలిసి తమ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రం చేశారు. సొంతంగా చీపురు తెచ్చుకుని, క్లాత్, మగ్గు, బకెట్ తెచ్చుకుని తరగతి గదులను క్లీన్ చేశారు.
అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం ఈరోజు ఉదయం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విచ్చేశారు. స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పైపు నీళ్లతో తరగతి గదిని క్లీన్ చేశారు. ఆ తరువాత శుభ్రంగా తుడిచారు. విద్యార్థులు కూర్చునే టేబుల్ కింద దుమ్ము ధూలి లేకుండా క్లీన్ చేశారు. తరగతి గదిలోని మూలమూలకు వెళ్లి చీపురు పట్టి ఊడ్చి నీళ్లతో క్లీన్ చేశారు. తరగతి ఆవరణలోనూ నీళ్లు చల్లారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. “మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ వర్గాలను కలుస్తున్నాం. అనేక సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా “స్వచ్ఛ పాఠశాల” పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని పాఠశాలలను పరిశుభ్రం చేయాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని కోరాం. స్పూర్తిదాయకమైన సేవా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. టీచర్లు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొని తమ వంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఏ స్కూల్ ను ఎవరెవరు శుభ్రం చేయాలనే విషయంపై నిన్ననే ‘‘టిఫిన్ బైఠక్’’ నిర్వహించాం.
అందులో భాగంగా ఈరోజు పాఠశాలలను శుభ్రం చేస్తున్నాం. దీంతోపాటు పాఠశాలల్లో పిల్లలను చేర్చించాలని కోరుతూ సోమవారం గ్రామాలు, మండలాల వారీగా ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నది నా సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఈసారి కూడా సైకిళ్లు అందించబోతున్నాం. టెన్త్ విద్యార్థులందరికీ నా వేతనం నుండి పరీక్ష ఫీజు చెల్లిస్తా. పాఠశాల అభ్యున్నతి కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతా. పాఠశాలలో నెలకొన్న సమస్యలపైనా త్వరలోనే సమీక్ష చేస్తా. పరిష్కారానికి చర్యలు తీసుకుంటా” అని బండి సంజయ్ అన్నారు.

