కలం, డెస్క్ : బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సంచలన కామెంట్లు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను జైల్లో కూడా హింసించారు. కావాలనే దోమలు ఎక్కువున్న రూమ్ లో ఉంచారు. చలి పెడుతుందని ఎంత రిక్వెస్ట్ చేసినా దుప్పటి ఇవ్వలేదు. నాకు జ్వరం వచ్చినా సరే కనీసం ట్యాబ్లెట్లు ఇవ్వలేదు. డాక్టర్లను పిలిచి చూపించలేదు. నా ఫ్యామిలీ మెంబర్లను చూడనివ్వకుండా ఇబ్బంది పెట్టారు’ అంటూ చెప్పుకొచ్చారు బాల్క సుమన్.
జైల్లో తమకు ఎన్నో నిబంధనలు పెట్టారని బాల్క సుమన్ (Balka Suman) ఆరోపించారు. పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే జైల్లో తనను ఇబ్బంది పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు రోజుల పాటు నా తరఫున లాయర్ కోర్టులో పోరాడి చివరకు దుప్పటి ఇప్పించారు. చదువుకుందామంటే పుస్తకాలు ఇవ్వలేదు. పేపర్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. సరైన భోజనం, తాగునీరు కూడా లేకుండా హింసించారు’ అంటూ బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

