కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని (Balineni) శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అరాచకాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చివరికి తెలుగుదేశం పార్టీ సొంత కార్యకర్తలు సైతం ఆయన వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమగ్ర దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని బాలినేని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నందునే ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఉన్నట్లు వెల్లడించారు. ఇకపై తననుగానీ, తన అనుచరులనుగానీ ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. తమ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడనని హెచ్చరించారు.
తన అనుచరులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక, మైనింగ్, వైన్స్ వ్యాపారాల్లో ఎమ్మెల్యేకు క్రమం తప్పకుండా వాటాలు వెళ్తున్నాయని, ప్రతిరోజూ ఆయనకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.

