కలం, మెదక్ బ్యూరో : గజ్వేల్ (Gajwel) లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (KCR Camp Office)పై జరిగిన దాడి స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. గజ్వేల్ శివారులో ఉన్న ఈ కార్యాలయ కిటికీ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో ఉంచేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షా రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా వెళ్లి కార్యాలయంలో ఆ ఫోటోను ఉంచారు.
అయితే కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలుస్తోంది. తాము కేవలం ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే అక్కడ ఉంచామని, దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

