కలం, వెబ్ డెస్క్ : అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఒక్కసారిగా పోటెత్తిన ఆకస్మిక వరదల ధాటికి ఐదవ గ్రెనేడియర్ దళానికి చెందిన రెండు తాత్కాలిక షెల్టర్లు కొట్టుకుపోయాయి. ఈ తీవ్ర ప్రమాదంలో ఏడుగురు సైనికులు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోగా, వారిలో ఇద్దరిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించగలిగాయి. నీటి ప్రవాహంలో గల్లంతైన మరో ఐదుగురు జవాన్ల కోసం దళాలు గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి.
ఆచూకీ లభించని వారిలో హవిల్దార్ ఉపేందర్ తో పాటు కుందన్, వినోద్, ఆదిత్య, సముంద ఉన్నారు. మరొక వైపు అప్పర్ సుబన్సిరి జిల్లాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న కియోజరింగ్-బయాచింగ్ రోడ్డు నిర్మాణ పనుల ప్రాంతంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ శిథిలాల కింద కొంతమంది కార్మికులు చిక్కుకుపోగా, ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు దృవీకరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.

