కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి భారీ ఎత్తున దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Scam) కేసులో విచారణను తీవ్రతరం చేసిన ఈడీ, ఈ స్కామ్లో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. ఈ పరిణామంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోని పదికి పైగా చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో ముమ్మర సోదాలు చేపట్టారు. రాజ్ కేసిరెడ్డి నివాసాలు, కార్యాలయాలతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఆరుగురి ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ మద్యం స్కామ్లో రూ. వేల కోట్లు చేతులు మారాయని ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. హవాలా, మనీలాండరింగ్ మార్గాల ద్వారా భారీ ఎత్తున నిధులను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం బయటపడుతున్న హవాలా, మనీ లాండరింగ్ లింకులు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ విచారణలో వెలుగుచూస్తున్న అంశాల ఆధారంగా అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని, త్వరలోనే అక్కడ కూడా ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటూ రాజకీయ, అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

