కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) అన్నారు. ముఖ్యంగా డీజిల్ ను అన్నదాత అవసరాల కోసం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలోని డీజిల్ ను అమరావతి పనుల కోసం తరలించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
తమ ప్రభుత్వ హయాంలో అదానీ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు పారదర్శకంగా భూములు కేటాయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 99 పైసలకే భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుతుందని .. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ఫైర్ అయ్యారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం కుదలైందని… ప్రస్తుతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడుతున్నాయని విమర్శించారు. మరోవైవు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూటమి పాలన పట్ల సంతృప్తికరంగా లేరని చెప్పారు.

